చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్

  • ఎన్నికల సంఘానికి నటుడు విజయ్ లేఖ
  • బస్ టెర్మినళ్లలో చిక్కుకున్న ఓటర్ల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్
  • బెల్జియం నుంచి నేరుగా వచ్చి ఓటేసిన నటుడు అజిత్
  • తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్, తమిళనాడులో పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘానికి (ఈసీ) కీలక విజ్ఞప్తి చేశారు. బస్ టెర్మినళ్లలో చిక్కుకుపోయిన ఓటర్ల కోసం తక్షణమే అదనపు ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గురువారం చెన్నైలోని నీలంకరై పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. ఎన్నికల విధులకు పెద్ద సంఖ్యలో బస్సులను తీసుకోవడంతో చెన్నైతో పాటు ఇతర నగరాల్లోని బస్ టెర్మినళ్లలో వేలాది మంది ఓటర్లు చిక్కుకుపోయారని తెలిపారు. వారికి తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేదని వివరించారు. ఓటు వేయడానికి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... తమిళనాడులో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి స్టెల్లా మేరీస్ కాలేజీలో ఓటేశారు. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్‌తో కలిసి తేనాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. బెల్జియంలో రేసింగ్‌లో పాల్గొని, ఓటు వేయడం కోసం ప్రత్యేకంగా చెన్నైకి తిరిగి వచ్చిన అజిత్, తిరువాన్మియూర్‌లో ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్ అల్వార్‌పేటలో ఓటేశారు. విక్రమ్, గౌతమ్ కార్తీక్, దర్శకులు పా రంజిత్, అట్లీ, హెచ్ వినోద్‌, విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Vijay
EC
public transport
TN Elections

More Telugu News